కారు నీకు ఎదురొచ్చినా...నువ్వు కారుకు ఎదురెళ్లినా యాక్సిడెంటైపోవడం ఖాయం.
గులాబీ రెపరెపలకు మినిమమ్ మరో పదేళ్లపాటు తిరుగులేదని తేలిపోయింది. హోరుగాలికి ఎదురెళ్లినా ఎగిరిపోతారు. జోరు మీదున్న కారుకు అడ్డంపడినా యాక్సిడెంటైపోతారు. పోవడం ఖాయమనుకున్నప్పుడు దారివ్వడమే మేలన్నది తెలంగాణలో అన్ని పార్టీలు గుర్తెరిగాయి. కానీ కొద్ది మందికి అంటే ఆర్కేలాంటి వాళ్లకు ఏ మూలో భ్రమ ఉండేది. వరంగల్ ఎన్నికతో ఆ ముచ్చట తీర్చేశారు కేసీఆర్ సారు. ఇక గ్రేటర్ ఎన్నికలకు ముందే చిత్రం ``ది పిక్చర్ వెరీ క్లియర్``. లోటస్పాండ్ బాస్ తనది హైదరాబాద్ తాత్కాలిక చిరునామాయేనని తప్పించుకున్నారు. బాబు జాగ్రత్తగా ఒకటిరెండు సభలకు సరిపెట్టి సైడైపోయారు. పవన్ సైలైంటయ్యారు. ఇది పూర్తిగా పరువు పోకుండా కాపాడగలిగింది. అయితే గెలిచిన ఇద్దరు ముగ్గురు గులాబీ గూటికి చేరకుండా కాపాడుకునే శక్తి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్లకు ఆ భగవంతుడివ్వాలని ప్రార్థించడం తప్పించి ఏం చేయలేం. ఇక ఎంఐఎం అంటే టీఆర్ ఎస్ మిత్రులేనని గులాబీ దళపతి ఎన్నికలకు ముందే ప్రకటించారు. అంటే పంచాయతీ నుంచి మండలాలు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, శాసనసభ వరకూ టీఆర్ ఎస్ చేసింది చట్టం, పాస్ చేసిందే బిల్లు. ఈ అప్రతిహత జైత్రయాత్ర ఎన్నేళ్లంటే ..మరో దఫా తప్పనిసరిగా ఉంటుంది. ఇంకో దఫాకు కూడా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు ఇలాగే లోపాయికారీగా సహకరిస్తే ... ఎలక్షనాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం. జ్యోతిబసు రికార్డును కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కలిసి తిరగరాసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ప్రతిపక్షంలో మిగిలిన ఒకటీ అరా మొరుగుతున్న సింహాలు, పులులు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో ఈ పదిహేనేళ్లు కాలం గడిపితే..అటవీశాఖా మంత్రి జోగు రామన్నకు చెప్పి కేసీఆర్ సారు..ఒక ముక్క ఎక్కువ చికెన్ వేసే ఏర్పాటు చేయిస్తారు. లేదంటే..సింహాలు, పులులతో బస్తీల్లో సర్కస్ ఆడించేస్తారు.